8, డిసెంబర్ 2015, మంగళవారం

హిమగిరి సొగసులు మురిపించును మనసులు - సముద్రాల వారి ఆణిముత్యం



హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు 
హిమగిరి సొగసులు మురిపించును మనసులు

యోగులైనా మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞ సీమ
సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగసీమ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు

ఈ దివిని ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి కేళి తేలి లాలించెలేమా
హిమగిరి సొగసులు మురిపించును మనసులు


కవి హృదయం సన్నివేశానికి సరిపడా ఎలా భావాన్ని ఆవిష్కరించాలో బాగా ఎరిగి ఉండాలి అన్నదానికి చక్కని ఉదాహరణ ఈ గీతం. పాండవుల వనవాసంలో భీముడు, ద్రౌపది పాత్రలపై చిత్రీకరించబడిన ఈ శృంగార యుగళ గీతం హిమాలయాలు ప్రకృతీపురుషుల తత్త్వాన్ని ఎలా ఆవిష్కరించిందో చూడండి.

హిమాలయాలు సమస్త దేవతా సమూహానికి నివాసలు. కైలసగిరిలో ప్రమథగణాలతో శివపార్వతులు కొలువుంటే, శ్రీమహావిష్ణువు, సమస్త నదీనదాలు, ఆది పరాశక్తితో సహా ఎందరో దేవతలు ఈ పుణ్యభూమిని ఆలవాలం చేసుకున్నారు. అటువంటి భూమిలో ప్రకృతి కూడా పులకరించి పరిపూర్ణమైన దివ్యత్వంతో నిండి ఉంటుంది.

ఈ ప్రాతిపదికను పునాదిగా చేసుకొని సముద్రాల రాఘవాచార్యుల వారు పాండవ వనవాసం చిత్రానికి హిమగిరి సొగసులో అనే గీతాన్ని రాశారు. భీమసేనునిగా నవరసనటనా సార్వభౌముడు అన్న ఎన్‌టీ్ఆర్, ద్రౌపదిగా మహానటి సావిత్రి ఈ యుగళగీతానికి తమ నటనతో ప్రాణం పోశారు. స్త్రీపురుషుల మధ్య వలపులు రేపటానికి ప్రకృతి అతి ముఖ్యమైన కారణం. అందులో హిమాలయాలంటే? మంచు, కొండలు, ఎత్తైన చెట్లు, లోయలు, రమణీయమైన పుష్పాలు, అరుదైన ఫలాలు...అన్నీ అక్కడే. ఇక్కడే యోగులు, సిద్ధులు తపస్సు చేసేది. యక్ష, కిన్నెర, గంధర్వులు విహరించేది. ఇలా, హిమాలయాలలో అణువణువు దివ్యత్వం నిండి ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి స్త్రీ పురుషుల మనసులలో ఊహలు చిగురిస్తాయి. యోగులైనా, భోగులైనా మనసు పడే అందాల సీమ అని కవి వర్ణించటానికి కారణం అక్కడి ప్రకృతిలోని దివ్యత్వమే. దేవతలు సరస సల్లాపములాడే భూమి ఇది. హిమవంతుని పుత్రిక అయిన పార్వతి శివుని కోరి తపస్సు చేసింది కూడా ఇక్కడే. ఆ ఉమాదేవి శంకరుని సేవించి తరించిన ప్రదేశం ఈ హిమాలయాలు. రతీమన్మథుల కేలి జరిగింది కూడా ఇక్కడే. అంతటి మహత్తరమైన హిమగిరి సొగసులు చూసి మోహావేశులు కానివారెవ్వరు?

సముద్రాల రాఘవాచార్యుల వారు తెలుగు సినీ జగత్తులు ఒక రెండు దశాబ్దాల పాటు సాహిత్య ప్రపంచాన్ని ఏలారు. ఆయన రామాయణాన్ని ఒకటి కాదు రెండు కాదు పదికిపైగా పాటలలో సంక్షిప్తంగా వర్ణించారు. పాటలే కాదు, సంభాషణలు కూడా అంతే మనోజ్ఞంగా అందించారు. అటువంటివాటిలో ఒక్కటి ఈ హిమగిరి సొగసులు పాండవ వనవాసం చిత్రంలోనిది. ఘంటసాల మాష్టారు స్వీయ సంగీత దర్శకత్వంలో, సుశీలమ్మతో కలిసి పాడిన యుగళ గీతం ఇది. మంచి స్వరాలతో, రాగయుక్తంగా, భావయుక్తంగా పాడిన ఈ గీతం తెలుగు  సినీ స్వర్ణయుగపు పాటల ఆణిముత్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.


1 కామెంట్‌: