26, సెప్టెంబర్ 2015, శనివారం

పాకశాస్త్రం - పవిత్రమైన యజ్ఞం


వంట చేయటం ఒక శాస్త్రమే. పాకశాస్త్రమని చెప్పింది మన ఆగమం. నైపుణ్యంతో పాటు ముఖ్యమైన లక్షణాలు కొన్ని ఉండాలి:

1. వంట చేసేటప్పుడు పాత్ర శుద్ధి, వస్తుశుద్ధి మరియు దేహశుద్ధి తప్పనిసరి. పాత్రశుద్ధి తినేవారి ఆరోగ్యం కోసం, పరమాత్మ స్వీకరణ కోసం. వస్తుశుద్ధి రుచికోసం, దోషనివారణ కోసం.  శరీరశుద్ధి మనసుకు, మనశ్శుద్ధి కర్మకు, కర్మశుద్ధి వంటలలోకి ప్రసరిస్తుంది. స్నానం కుదరకపోయినా, తలదువ్వుకొని (వెంట్రుకలు రాలకుండా), కాళ్లు చేతులు శుభ్రం చేసుకొని చేయాలి. అలాగే దేహపుష్టి కూడా ముఖ్యం. ఓపిక, బలం లేని వాళ్లు వంట చేస్తే వంటలు కూడా నీరసంగానే వస్తాయి.

2. వంట చేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో ఉండాలి. వంటలోని ప్రతి అడుగులోనూ ఈ ప్రశాంతత రుచికి తోడ్పడుతుంది. ముక్కలు సరైన పరిమాణంలో ఉండటం, ఉప్పుకారం సరైన మోతాదులో ఉండటం, సరైన పాళ్లలో ఇతర పదార్థాలు ఉండటం, సరైన విధంగా ఉడకటం...వీటన్నిటిలో వంట చేసే వారి ప్రశాంతత ప్రతిబింబిస్తుంది. పిల్లలపై, జీవితభాగస్వామిపై, అత్తగారిపై, యజమానిపై, వృత్తిపై ఉన్న కోపం వంట చేసే సమయంలో మీ మనసులో ఉంటే, వంట అదే వికారంతో వస్తుంది. అలాగే భారమైన మనసుతో చేస్తే వంట అదే విధంగా రుచిని పొందుతుంది.

3. తినేవారిపై ప్రేమతో చేయాలి. వారంతా సంతోషంగా, తృప్తిగా సరిపడా తినాలి, వారు ఆత్మానందపరితుష్టులవ్వాలి. ఈ ఆలోచనలతో ఉంటే ఫలితం అలానే ఉంటుంది. వీళ్ల దుంపతెగ నేను ఎలా చేసినా వీళ్లకు నచ్చదు, ఎంత తింటారో, వీళ్లు తినే తిండికి ఇదే ఎక్కువ..ఇలాంటి ఆలోచనలతో చేస్తే ఆ భావాలే ఆ వంటలకు అలదుతాయి.

4. ధ్యాస వంటపై ఉండాలి. అష్టావధానం చేస్తే ఫలితం అలానే ఉంటుంది. వంట చేస్తూ ఆఫీసులో పనో లేక సాయంత్రం చూడబోయే సినిమాపైనో లేక పండగకు కొనాల్సిన వస్తువుల గురించో ఆలోచన ఉంటే మోతాదులు సరిగా కుదరవు. వంట కూడా ఒక యజ్ఞమే. ధ్యాస, పవిత్రత అన్నివిధాలా తప్పనిసరి.

5. తినేవారి ఇష్టాయిష్టాలను బట్టి చేయాలి. వండిన పదార్థాన్ని పరమాత్మ భుజిస్తాడు అన్నదానిని నమ్మి చేయాలి.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం

అని పరమాత్మ చెప్పాడు. అన్నాది పక్వములు, పాకశాస్త్రం, భోక్త అన్నీ యజ్ఞాలే.

కాబట్టి వంట అంటే ఆషామాషీగా టూ మినిట్స్ మ్యాగీలా చేయకండి. లోనికి వెళ్ళే ప్రతి మెతుకు అగ్నిదేవునికి సమర్పణ. శరీరం యజ్ఞకుండం, చేసిన ప్రతి పదార్థం పూర్ణాహుతి ఫలం పొందాలి అన్న భావనతో చేయండి. పదిరకాలు చేయటం కాదు ముఖ్యం, చేసినవి శుద్ధిగా, పవిత్రంగా, సద్భావనలతో చేయటం, ఆ విధంగా భావించి భుజించటం ముఖ్యం.

అన్నాద్భ్వంతి భూతాని....అన్నమునుండే అన్ని ప్రాణులు జన్మించాయి. కాబట్టి అన్నాదులను తయారుచేయటంలో కూడా శ్రద్ధ, భక్తి, పవిత్రత ముఖ్యం. అందుకే మీరు ఎనంతి హోటళ్లలో తిన్నా, ఇంట్లో అమ్మ, భార్య వండిన వంటకు సమానం కానే కావు. ఎందుకంటే ఇంటి ఇల్లాలు ఈ భావనలతోనే చేస్తుంది కాబట్టి. హోటళ్లలో వంటవాడు రోజూ చేసి చేసి, ఎంతో ఎక్కువ మోతాదులు చేసి, సమయాభావం వలన, పదర్థాలు, పాత్రలు, మనస్సు, తనువు శుద్ధిలేక పదార్థాలు శరీరానికి ఆరోగ్యకరం కావు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి