6, జూన్ 2015, శనివారం

తిరుమల తిరుపతి వేంకటేశ్వరా - మహామంత్రి తిమ్మరుసు


తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా 

చెలిమిని విరిసే అలర్మేల్మంగమ చెలువములే ప్రియ సేవలయా 

నయగారములను నవమల్లికలా 
మమకారాలను మందారములా 
మంజుల వలపుల మలయానిలముల 
వింజామరమున వీతుమాయా 

ఆశారాగమే ఆలాపనగా 
సరస రీతుల స్వరమేళనగా 
అభినయ నటనలే ఆరాధనగా 
ప్రభునలరించి తరింతుమయా

మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో పింగళి నాగేంద్రరావు గారి సాహిత్యం, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో ఎస్ వరలక్ష్మి, పి. సుశీల గారు కలిసి పాడిన గీతం.

చలనచిత్రాలు సందేశానికి, సంగీత సాహిత్యాలకు, భక్తికి మంచి మాధ్యమాలు అని నిర్మాతలు, దర్సకులు అనుకున్న కాలం 1950-60 దశాబ్దాలు. మహామంత్రి తిమ్మరుసు అనే చిత్ర కథ చరిత్రకు సంబంధించినది, రాచరికానికి సంబంధించినది. అందులో, విజయనగర సామ్రాజ్యాధీశుడు సాహితీ ప్రియుడు, బహుభాషా కోవిదుడు, ఎన్నో దేవాలయాలకు నిధులు ఇచ్చి, నిర్మించిన వాడు. సనాతన ధర్మం నిలబడి ముందుకు వెళ్లటానికి ఎంతో తోడ్పడిన మహనీయుడు. తెలుగు భాష మాధుర్యాన్నిఆస్వాదించి రచనలు చేసిన కోవిదుడు ఆయన. అటువంటి రాజు కొలువులో మంత్రి తిమ్మరుసు. మహామేధావి, విద్యా సంపన్నుడు. ఇటువంటి నేపథ్యం కలిగిన చిత్రం ఈ మహామంత్రి తిమ్మరుసు.



మహారాజుల సంగీత సాహిత్యాభిలాషలు అంతఃపురములలో రాణుల వద్ధ కూడా  వికసించేవి. దీనికి చరిత్ర సాక్ష్యం. మంచి సంగీత నృత్య కళాకారులు ఆస్థానాలలో పేరు పొందారు. అలాగే స్వయంగా రాజులు, రాణులు సంగీత సాహిత్య నృత్య ప్రావీణ్యం పొందారు. అందుకు మచ్చు తునకగా ఈ భక్తి గీతాన్ని మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో పొందుపరచారు. రాయలే వీణ వాయించగా రాణులు గానం చేయగా నర్తకి ఈ మధుర భక్తి సుమాన్ని మన ముందు ఆవిష్కరించారు. రాయలంటే అన్న ఎన్ టీ ఆర్ అనేలా ఆయన నటించారు. అలాగే ఎస్ వరలక్ష్మి, దేవిక గాత్ర ధర్మానికి అనుగుణంగా నటించారు. ఇక ఎల్ విజయలక్ష్మి సంగతి చెప్పేదేముంది? భరత నాట్య కౌశలాన్ని ఊహించలేని స్థాయికి తీసుకువెళ్లిన మహా నర్తకి ఆమె. ఈ గీతంలోని భావనను తన ఆహార్యముతో, ఆంగికముతో అద్భుతంగా నృత్యసేవగా ప్రదర్శించారు.

తిరుమల వేంకటేశుని నుతించే ఈ గీతంలో శరణాగతి భావన కన్నా సేవలో కలిగే మధుర భావాలను పొందు పరచారు. కృష్ణదేవరాయల రాణులపై చిత్రీకరించిన ఈ పాటలో తమలో కలిగే భావనలను ఎలా స్వామి సమర్పిస్తున్నారో కవి మనకు తెలియజేశారు.

ఓ వేంకటేశ్వరా! ప్రేమను, వరములనివ్వు స్వామీ! స్నేహాన్ని విరిసే అలమేలుమంగ యొక్క సౌందర్యమే నీకు ప్రియమైన సేవలు! మృదుత్వముతో కూడిన మాటలే నవ మల్లికలుగా, మమకారమే మందార పుష్పాలుగా, మంజులమైన వలపులే పిల్లగాలులుగా వింజామరలు వీస్తాము స్వామీ! ఆశతో కూడిన రాగమే ఆలాపనగా, సరసముతో కూడిన హావభావములే స్వరాల కలయికగా, నాట్యాభినయాలే ఆరాధనగా నిన్ను అలరించి తరించెదము స్వామీ!

శృంగార రసంతో కూడిన భక్తిని మధురభక్తి అంటారు. అన్నమాచార్యుల నుండి క్షేత్రయ్య వరకు ఈ మధురభక్తిని తమ పదాలలో విశదీకరించారు. మనలో కలిగే ఏ భావననైనా స్వామికి అహంకారం లేకుండా సమర్పించ గలిగితే అది ఆయనకు స్వీకారమే. అందుకే మహా వాగ్గేయకారుల శృంగార ప్రాధాన్యమైన సంకీర్తనలు  స్వామి పాదాల వద్ద శాశ్వత సుగంధ పూరితమైన పుష్పాలుగా నిలిచాయి. అటువంటి గీతమే ఈ తిరుమల తిరుపతి వేంకటేశ్వరా. కళాకారులలో స్వతహాగా కలిగే మానవీయ భావనలకు దివ్యత్వం కలిగించే రీతిలో సాగుతుంది ఈ గీతం.

పింగళి నాగేంద్ర కవి యొక్క రస హృదయస్పందనే ఈ మంచి గీతం. దీనికి పెండ్యాల వారి మాధుర్య భరితమైన సంగీతం తోడై ఒక పరిపూర్ణమైన గీతంగా నిలిచింది. మాధుర్యానికి మారుపేరైన సుశీలమ్మ గారి గొంతు, గాంభీర్యానికి, భావానికి నెలవైన ఎస్ వరలక్ష్మి గారి గొంతు ఈ గీతానికి సాధనాలై ఇప్పటికీ మధుర భక్తి సువాసనలను చిందింపజేస్తున్నాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి