19, మే 2015, మంగళవారం

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 


పేరులోనే ఉంది అర్థమంతా. చెవులకు అమృతంగా అనిపించే రామస్తుతి ఇది. లీలాశుకుడు శ్రీకృష్ణకర్ణామృతం రచిస్తే ఈ రామకర్ణామృతం ఎవరు రచించారో తెలియటం లేదు. సిద్ధకవి ఈ సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించారు. ఛందోబద్ధంగా సాగే ఈ ధార రాముని రూప గుణ మహిమల వర్ణనను మనకు ఎంతో మనోజ్ఞంగా అందిస్తుంది. రాముడంటేనే పరిపూర్ణ సులక్షణ సంపన్నుడు. ఆ ధర్మమూర్తి వైభవాన్ని ఎంత పొగిడినా, ఎందరు నుతించినా తనివితీరదు. 

రామకర్ణామృతంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, తాత్పర్యము: 

వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిం స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం 

ఎడమతొడపై కూర్చున్న సీత సేవించుచుండగా, శోభించుచున్న ధనువునొక చేతిలో, పైచేతిలో చక్రము, కుడిచేతులలో శంఖము మరియు బాణములను ధరించియున్న, కలువరేకులవంటి కన్నులు కలిగిన, భద్రాచల శిఖరమందు వెలసిన, భుజకీర్తులు మొదలైన ఆభరణములతో అలంకరించబడిన, నల్లనైన రఘురాముని భజిస్తున్నాను.

వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయ్వాది కోణేష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం

ఎడమవైపున సీత, ఎదుట హనుమంతుడు, వెనుక లక్ష్మణుడు, పక్కన భరతశత్రుఘ్నులు, వాయువ్యము మొదలైన దిక్కులందు సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు యుండగా మధ్యనందు నల్లని కలువవలె సుందరమైన కాంతి కలిగిన రాముని భజించుచున్నాను. 

వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం

కల్పవృక్షము క్రింద, బంగారుమంటపమందు, పుష్పకము నడుమ మాణిక్య పీఠమందు, సీతతో కూడి వీరాసనమందున్నట్టి, ఎదుట ఆంజనేయుడు పలుకుచుండగా, పరతత్త్వమును మునులకు చెప్పుచు, భరతుడు మొదలగువారిచే ఆచరించబడిన, నల్లని రాముని భజిస్తున్నాను.

జానక్యాః కమాలంజలిపుటే యాః పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా

ఏ ముత్యములు సీతమ్మ పద్మమువంటి నిర్మలమైన దోసిలియందు పద్మరాగ మణులవలెనున్నవో (ఆమె దోసిలు ఎరుపు గనుక ఎర్రగా యున్నవి అనుట), రాముని శిరముననుంచబడుచు మల్లెపూవువలె నున్నవో (దోసిలికి తలకు మధ్య పలువరుస వలె తెలుపుగా యుండుట), జారుచు రాముని నల్లని దేహకాంతితో కూడినవై ఇంద్రనీలము వలె నున్నవో (నల్లని దేహకాంతిచే నల్లగా నున్నవి యనుట), అట్టి రామ వివాహమందలి తలంబ్రాల ముత్యములు మనకు శుభము కలిగించు గాక!

రామయ్య నీలమేఘ శరీర చాయ, ధనుర్బాణాలు, పక్కన సీతమ్మ. వామభాగమున ఆ తల్లి, వెనుక మరియు ప్రక్కల సోదరులు, ఇతర హితులు, ముందర హనుమంతుడు. ఇదీ రామ పట్టాభిషేక సన్నివేశం. సోదరులు, హితులు, సేవకులు, దాసుల మధ్య రామయ్య సీతమ్మతో ప్రకాశించే చిత్రాన్ని మొదటి మూడు శ్లోకాలు వర్ణిస్తున్నాయి. శ్రీరామచంద్రుని కొలువుతీరిన రీతి చాలా సుందరంగా వర్ణించారు కర్త. మొదటి శ్లోకంలో భద్రాద్రి రాముని గురించి ప్రస్తావించారు. కాబట్టి ఈ రామకర్ణామృతం రచయిత భద్రాద్రి రాముని సేవించిన వారై ఉండాలి.

ఇక నాలుగవ శ్లోకం మనకు ప్రతి పెండి పిలుపుపై కనిపించేది. సీతారాముల ఆదర్శ దాంపత్యం మన భారతీయ జీవనశైలిపై ఎంత ప్రభావాన్ని చూపిందో! వివాహమనగానే సీతారాముల కళ్యాణమే గుర్తుకు వచ్చేలా మనకు పెద్దలు రామాయణాన్ని జీవితంలో పొందుపరచారు. సీతారాముల దేహకాంతులను బట్టి ముత్యాల తలంబ్రాలు ఏ విధంగా అగుపిస్తున్నాయో కవి తెలిపారు మనకు. ఈ తలంబ్రాల సాంప్రదాయం దక్షిణాది వారిదే కాబట్టి రచయిత ఇక్కడి వాడని నా అభిమతం. భాషను, శైలిని, నేపథ్యాన్ని బట్టి చూస్తే సీతారాముల కళ్యాణము మరియు పట్టాభిషేకము వంటి వేడుకల కళ్లారా కాంచి ఈ శ్లోకాలు రచించబడ్డాయి అని అర్థమవుతోంది. కవి ఎవరో కానీ, మనకు ఎప్పటికీ వివాహమహోత్సవాలలో, రాములవారి వేడుకలలో ఎప్పటికీ నిలిచిపోయే సాహిత్య వైభవాన్ని మనకు సంపదగా ఇచ్చారు. మరిన్ని శోకాలతో ముందు భాగాలలో

2 కామెంట్‌లు: