18, మే 2015, సోమవారం

బాలమురళీ రవం - శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం

బాలమురళీ రవం -  శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం



శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం
వరసిద్ధి వినాయక భక్త జనాళి పోష వర చంద్రమౌళి సుత

దాసార్చిత పాద భాసురాంగ కరుణాసముద్ర వర వాయుపుత్ర హనుమంత వరప్రద
శ్రీ సకల శివంకర మారుతి మామవతు
వర రామ సునామ సుధారస పాన దీన నిజ భక్త భయాపహ
శ్రి సకల శివంకర మారుతి మామవతు

నంద నందన వందనమస్తు తే కుంద రదన ముకుంద మురహర
మందరోద్ధర వందిత బుధజన బృంద హృదయ నివాస సుందర
మందహసిత వదనారవింద మకరంద పాన సంగీత సుధాకర

శ్రి సకల కళా పరిపూర్ణ దయాశరధే
వరదాభయదాయక మామవ మంగళాంగ మురళీరవ మోహన

శ్రీ సకలకళా పరిపూర్ణ దయాశరధే
శ్రి సకల శివంకర మారుతి మామవతు
శ్రి సకల గణాధిప పాలయమాం అనిశం

ఓ సకల గణములకు అధిపతియైన విఘ్నేశా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. నీవు కామ్యములను తీర్చి భక్తులను కాపాడే వాడవు! చంద్రుని ధరించే శివుని కుమారుడవు!

దాసులచే అర్చించబడిన పాదములు కలిగి, ప్రకాసించే దేహంగములు కలిగి వాయుపుత్రుడవైన ఓ హనుమంతా! వరాలను ప్రసాదించే వాడా! సకల శుభములను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము! వరములిచ్చే రాముని దివ్య నామ రసామృత పానం చేసిన, దీనులైన నిజ భక్తుల భయాలను తొలగించే, సకల శుభాలను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము!

నందుని కుమారా! నీకు వందనములు! మల్లెమొగ్గలవంటి పలువరుస కలవాడా! ముర అనే రాక్షసుని సంహరించిన వాడా! మందర పర్వతాన్ని మోసిన వాడా! నీకు నమస్కరించిన పండితుల హృదయాలలో నివసించే వాడా! అందగాడా! చిరునవ్వు చిలికిస్తూ తేనె వంటి సంగీతాన్ని పలికించే ఓ శ్రీకృష్ణా! ఓ సకల కళాపరిపూర్ణా! దయాసాగరా! మురళీరవముతో విశ్వాన్ని సమ్మోహనం చేసే కృష్ణా! నాకు వరములు, అభయము ఇమ్ము!

ఓ సకల కళాపరిపూర్ణా! దయాసాగరా!
సకల శుభములను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము!
ఓ సకల గణములకు అధిపతియైన విఘ్నేశా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము!

బాలమురళీకృష్ణగారి మరో ఆణిముత్యం ఈ ఆరభి రాగంలోని శ్రీ సకలగణాధిప...ఇందులో ముగ్గురు దేవతలను నుతిస్తున్నారు కృతికర్త - మొదట గణపతిని, తరువాత హనుమంతుడిని, చివర శ్రీకృష్ణుడిని. సంస్కృత భాషలో ఈ కృతి రచన జరిగింది. దైవముల గుణగణ వర్ణనకు ఆరభి రాగం సముచితమైనది అని మనకు సాధించెనే ఓ మనసా అనే త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన ద్వారా అర్థమవుతుంది. ఘనమైన ఈరాగంలో ఈ సంకీర్తనను కట్టడం బాలమురళి గారి సంగీత మేధో సంపత్తికి సరస్వతీ కటాక్షానికి నిదర్శనం.

ఏ అర్చనలోనైనా తొలుత గణపతి పూజ తప్పనిసరి. అందుకే వాగ్గేయకారులు తొలుత ఆ విఘ్నవినాశకుడు, వరప్రదుడు, శివపుత్రుడైన గణపతిని మధురమైన పదాలలో కొలుస్తున్నారు. వాగ్గేయకారుల ప్రధాన లక్షణం దైవానికి దాసులవ్వటం. అందుకే ఆయన దాసులలో అగ్రగణ్యుడైన హనుమంతుని నుతిస్తున్నారు.  చివర అయన ముద్రకు మూలదైవమైన శ్రీకృష్ణుని నాలుగు ఎక్కువ పదాలతో నుతిస్తున్నారు. కృష్ణుడు అనగానే పదాలు, అందము, మురళీ గాన మాధుర్యము గుర్తుకు వచ్చేలా బాలమురళి గారు ఈ చరణాన్ని సాహిత్యంతో అలంకరించారు.

సకల కళా పరిపూర్ణ దయాశరథే అని పొగడటంలో ఆంతర్యం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు గురువుల వద్ద అన్ని విద్యలను నేర్వటంతో పాటు బాలునిగా ఉన్నప్పుడు ఎన్నో చిలిపి చేష్టలను చేసి గోకులాన్ని మురిపించాడు. అటు తరువాత ప్రేమకు నిర్వచన కృష్ణ భక్తిగా నిర్వచనం కలిగించాడు. ప్రేమకు సంగీతము, నృత్యము ఉచ్చ్వాస నిశ్శ్వాసల వంటివి. వెదురుపొదలలో ఒదిగి ఆయన వేణువును పలికిస్తే గోపకులమంతా తమను తాము మరచి ఆయనతో ఏకమయ్యింది. అలాగే కురు పాండవ సంగ్రామంలో ఆయన ప్రదర్శించిన రాజనీతి, ఉపాయములు ఆయనను సకల కళా పరిపూర్ణతకు మచ్చుతునకలు. అందుకే ఈ చరణం ఈ కృతికి పతాకస్థాయినిచ్చింది.

పదప్రయోగం, రాగ-భావ సమ్మేళనం, భక్తి అన్నీ సమపాళ్లలో కలిసి ఈ కృతిని బాలమురళి గారి రచనలలో అగ్రగణ్యగా చేశాయి. ముందు తరాలవారికి బాలమురళిగారి కృతులు తప్పక మార్గదర్శకాలు.

ఈ కీర్తనను బాలమురళి గారి గళంలో వినండి.

2 కామెంట్‌లు: