27, జూన్ 2011, సోమవారం

ధర్మస్థళ మంజునాథుడు - మహా ప్రాణదీపం శివం శివం

మంజునాథుడు
శంభో! గిరీశ! సురపూజిత! కామవైరిన్!
గౌరీశ ! శంకర! మహేశ్వర! విశ్వహేతో!
ధర్మస్థలేశ! సకలేశ! దయాపయోధే!
శ్రీ మంజునాథ! నిరతాం కురు మంగళం మే!

శివతత్త్వమే అత్యంత శుభకరము, భవహరము, హృదయంగమము. అందులో సత్యక్షేత్రమైన ధర్మస్థళ మంజునాథుడు సాక్షాత్తు కలియుగంలో పిలిస్తే పలికేటి దైవముగా ప్రసిద్ధి చెందాడు. సత్యము, భిన్నత్వములో ఏకత్వము, సామ్యము, భక్తి, ధర్మ బద్దత ఈ క్షేత్రపు విశిష్టత. కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమకనుమలలో నేత్రావతి నది ఒడ్డున వెలసి అలరారుతున్నది శ్రీ క్షేత్ర ధర్మస్థళ. ఇక్కడ అణువణువు పరబ్రహ్మ మయము. అన్నదానము (ప్రపంచంలో ఇంకెక్కడా అన్నదానం ధర్మస్థళలో జరిగినట్లు జరుగదేమో), విద్యా దానము (విద్యా సంస్థల ద్వారా), ఔషధ దానము (రోగుల కొరకు ఆస్పత్రులు), అభయ దానము (వివాహములకు) మొదలైన సేవాతత్పరతకు పుట్టిల్లు ఈ ధర్మస్థళ. తీర్థంకర జైనులచే ఆరాధించబడి, వారి పరంపరలో పరిపాలన సాగిస్తూ, హిందూ మత సాంప్రదాయములో నిత్య పూజలతో, జాతి కుల మత భేదము లేకుండా సర్వధర్మ సమభావాన్ని ఈ క్షేత్రం చాటి చెబుతోంది. దక్షిణాదిన ప్రజలకు తిరుమల వేంకటేశ్వరుని రీతి మంజునాథునిపై కూడా అపారమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం విశేషం.

ఒక్కోసారి చలనచిత్రాలు అద్భుతమైన భక్తి భావనలను, పారలౌకిక వర్ణనలను, మహాద్భుతమైన పద ప్రయోగం ద్వారా మనకు అందజేస్తాయి. అందులో 2001లో విడుదలైన శ్రీమంజునాథ చిత్రంలో శ్రీవేదవ్యాస రచించిన మహా ప్రాణ దీపం శివం అనే గీతం విశిష్టమైనది. శివతత్త్వాన్ని సంపూర్ణంగా వివరిస్తూ, ఆ మంజునాథుని వైభవాన్ని, భక్తుని ఆర్తిని అసమానమైన భాషా పరిజ్ఞానంతో వేదవ్యాసగారు మనకు అందించారు. దీనికి మధురమైన సంగీతం సరస్వతీ పుత్రులు హంసలేఖ గారు అందించగా గాయకుడు శంకర్ మహదేవన్ ఆ మహాదేవ శంకరుని పూర్తిగా ప్రేక్షకుల, వీక్షకుల హృదయాలలో నిలిపారు.

వీలైనంత వరకు సాహిత్యము నిశితంగా విని పొందుపరుస్తున్నాను. ఇంకా తప్పులేమైన ఉంటే దయచేసి తెలియజేయండి.

ఓం మహా ప్రాణదీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం 
భవానీ సమేతం భజే మంజునాథం
 
ఓం...నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్వరం అర్ధనారీశ్వరం త్రిదృశ హృదయంగమం చతుర్దధిసంగమం పంచ భూతాత్మకం షట్ఛత్రునాశకం సప్త స్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశా సువిమలం ఏకాదశోజ్వలం
ఏకనాథేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవ తారకం ప్రకృతి హిత తారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం వృషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరి మంత్ర మాధ్యం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ
మహాప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం 

ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢంకా నినాద నవ తాండవాడంబరం తద్ధిమ్మి తకధిమ్మి ధిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీత సాహిత్య సుమ కమలమంబరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్మ ప్రఘాతం పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక ధూర్తం విబుద్ధం సుహిద్ధం
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం మహానంద కందం మహాట్టాట్టహాసం జటా ఝూట రంగైక గంగా సుచిత్రం జ్వలన్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశ భాసం మహా భాను లింగం
మహాబభ్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం 
లింగేశ్వరం రామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం ఘృశ్నేశ్వరం త్య్రంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం..

అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం

ఓం.. నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయాచ.. 

ఈ గీతంలో భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలు, శివ నామావళి, గుణగణాలు, అనంత మహిమా విశేషణములు, శివుని రూపలావణ్యములు, దేహ లక్షణములు, చమక సారూప్యాలు, శివతాండవ ఉద్విగ్నాలు అన్నీ అనుపమానంగా రచించారు వేదవ్యాస్ గారు. బీజాక్షర రూపునిగా, పంచాక్షరీ వాసునిగా, పనసలో ఏకమును నుంచి ఏకాదశము వరకు ఏకామ్రేశుని సులక్షణ వర్ణన, పద ప్రయోగం దివ్యానుభూతిని కలిగిస్తాయి. ఒక పారలౌకిక స్థితిలోకి మనలను కొన్ని నిమిషాల పాటు తీసుకువెళ్లే ఈ గీతం ఎప్పటికీ శివలీలామృతాన్ని పంచే ఒక శాశ్వత సుగంధ సుమమని నా అభిప్రాయం. గీతాన్ని విని, చూసి ఆనందించండి.

26, జూన్ 2011, ఆదివారం

అన్నమయ్య నాదోపాసన - అన్ని మంత్రములు ఇందే ఆవహించెను

హరియవతార మీతడు అన్నమయ్య
కలియుగ దైవమైన వేంకటేశుని మంత్రాన్ని నుతిస్తూ తాళ్లపాక అన్నమాచార్యులు ఒక దివ్యమైన కీర్తన రచించారు. మంత్రాలన్నీ ఈ వేంకటేశ మంత్రములో నున్నవని దీని సారము. అమృతవర్షిణి రాగంలో అమృతాన్ని కురిపించారు అన్నమయ్య గురుదేవులు. సంకీర్తనా శైలిలో ఆనాటి వాడుక భాషలో, సుళువుగా పామరునికి కూడా అర్థమయ్యే భాషలో తన రచనలు చేసి అన్నమయ్య ఎప్పటికీ ప్రతి తెలుగువారి హృదయ కమలములోనూ సుస్థిర స్థానం ఏర్పచుకున్నారు. అవతారమంటే ఒక ముఖ్యమైన మార్పుకు నాంది వేసి దానిని సఫలీకృతం చేయటమే కదా? మరి ఆ ఏడుకొండలవాసుని వేల కీర్తనలలో నుతించి ఆ వేంకటేశ ప్రాభవాన్ని కలియుగ వాసులకు అందించారు అన్నమయ్య. అందుకే ఆయన అవతారము పూర్ణము, ధన్యము మరియు సాఫల్యము.

 సాహిత్యం:

అన్ని మంత్రములు ఇందే ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము


నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము


రంగగు వాసుదేవ మంత్రము ధృవుడు జపియించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము


ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము


వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి

భావము:

"చిన్నప్పుడే నాకు అందిన ఈ వేంకటేశ మంత్రములో అన్ని మంత్రాలు నిలయమై ఉన్నాయి. నారదుడు నారాయణ మంత్రము జపించగా, ప్రహ్లాదుడు నారసింహ మంత్రమును పొందాడు. సంకల్పముతో విభీషణుడు రామ మంత్రమును పొందగా, నాకు ప్రత్యేకముగా వేంకటేశ మంత్రము కలిగినది. ధ్రువుడు అందమైన వాసుదేవ మంత్రమును జపించగా, కృష్ణుని మంత్రమును అర్జునుడు భక్తితో సాధన చేసెను. చిలుక అయిన శుకుడు ముక్కుతో విష్ణు మంత్రమును పఠించగా, నాకు అనన్యమైన ఈ వేంకటేశ మంత్రము అబ్బినది. ఇన్ని మంత్రములకు శ్రీహరిని కనుటయే లక్ష్యము. ఇదియే తథ్యముగా పరబ్రహ్మ మంత్రము. నన్ను కాచుటకు నా గురువులిచ్చిన వెన్నెలవంటిది ఈ వేంకటేశు మంత్రము." - అన్నమయ్య

అంతరార్థము:

శ్రీ వేంకటేశుడే పరబ్రహ్మము. ఆయన మంత్రము మోక్షమునకు ఏకైక సాధనము. అంతకు మునుపు ఉత్తమోత్తములైన హరి భక్తులు (నారదుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, ధ్రువుడు, అర్జునుడు, శుకుడు) ఆ పరమాత్ముని వేర్వేరు అవతారముల మంత్రములతో కొలిచి మోక్షమును పొందారు. నాకు ప్రత్యేకమైన, అనన్యమైన వేంకటేశు మంత్రము చిన్నతనములోనే గురువుల అనుగ్రహము వలన వెన్నెల లాగా కలిగినది. అన్ని మంత్రములు ఈ వేంకటేశ మంత్రములో స్థిరమై ఉండుట వలన ఇదియే పరబ్రహ్మము, మోక్షకారకము అని అన్నమయ్య వేంకటేశుని మంత్ర మహిమను కొనియాడారు. కలియుగములో శ్రీనివాసుని స్మరించుట మించి మోక్షమునకు సులువైన మార్గము లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అందుకే ఆయనను 'హరి అవతారమీతడు అన్నమయ్య' అని కొలిచారు శిష్యకోటి. మన పాపములను హరించే శ్రీ వేంకటేశుని పాదపద్మములకు, అన్నమయ్య గురు చరణములకు నీరాజనములు.

విద్వాంసులు, సహృదయులు, గురువులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాదు గారు ఈ సంకీర్తనను అమృతవర్షిణి రాగంలో వెన్నెలరేయి అంత చల్లగా, వేసవి మామిడి పండంత తీయగా ఆలాపించారు. వారికి శిరసు వంచి పాదాభివందనములు.