14, జనవరి 2011, శుక్రవారం

శ్రీమన్నారాయణీయం - షష్ఠ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - షష్ఠ స్కంధము, తాత్పర్యము



ఇరువదిరెండవ దశకము - అజామిళోపాఖ్యానం

అజామిళో నామ మహీసురః పురా చరన్విభో ధర్మ పథాన్ గృహాశ్రమీ |
గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్సుఘృష్టశీలాం కులటాం మదాకులామ్ || ౨౨-౧


ప్రభూ! పూర్వ కాలమందు అజామిళుడను బ్రాహ్మణుడు వివాహము చేసుకుని గృహస్థ ధర్మము చక్కగా నిర్వర్తించు చుండెను. ఒకరోజు అతని తండ్రి అతనిని అడవికి పంపగా అక్కడ ఒక దుర్మార్గురాలు, కులట, మదించి యున్న స్త్రీని చూసెను.

స్వతః ప్రశాంతోఽపి తదాహృతాశయః స్వధర్మముత్సృజ్య తయా సమారమన్ |
అధర్మకారీ దశమీ భవన్పునర్దధౌ భవన్నామయుతే సుతే రతిమ్ || ౨౨-౨


అజామిళుడు మంచివాడైనప్పటికీ ఆ స్త్రీని చూడగానే మరులు గొని, స్వధర్మము వీడి ఆమెతో రమింప సాగెను. తరువాత అధర్మపు పనులు చేస్తూ తొంబది ఏళ్ల ముసలి వాడయ్యెను. తనకు పుట్టిన కొడుకునకు నారాయణుడను పేరు పెట్టి అతనిని ఎంతో ప్రేమించు చుండెను.

స మృత్యుకాలే యమరాజకింకరాన్ భయంకరాంస్త్రీనభిలక్షయన్భియా |
పురా మనాక్త్వత్స్మృతివాసనాబలాజ్జుహావ నారాయణనామకం సుతమ్ || ౨౨-౩

తన అవసాన దశ సమీపించినపుడు భయంకరులైన ముగ్గురు యమదూతలు  అతని ప్రాణాలు తీసికొని పోవుటకు వచ్చిరి. ఆ యమదూతలను చూసి భయపడి, పూర్వము నిన్ను ధ్యానిన్చియున్న పుణ్య ప్రభావము వలన నారాయణుడను తన పుత్రుని పేరు పెట్టి పిలిచెను.

దురాశయస్యాపి తదాత్వనిర్గతత్వదీయనామాక్షరమాత్రవైభవాత్ |
పురోఽభిపేతుర్భవదీయపార్షదాశ్చతుర్భుజాః పీతపటా మనోరమాః || ౨౨-౪


దేవా! అజామిళుడు దుర్మార్గుడైనప్పటికీ అతని ముఖము నుండి నీ నామము వెలువడిన వెంటనే నీ సేవకులు అక్కడకు వచ్చిరి. వారందరూ నాలుగు భుజములతో పీతాంబరములు ధరించి చాలా మనోహరముగా ఉన్నారు.

అముం చ సంపాశ్య వికర్షతో భతాన్ విముంచతేత్యారురుధుర్బలాదమీ |
నివారితాస్తే చ భవజ్జనైస్తదా తదీయపాపం నిఖిలం న్యవేదయన్ || ౨౨-౫

యమభటులు పాశములతో అజామిళుని లాగుచుండగా విష్ణుభటులు వదలి పెట్టుమని వారిని వారిన్చిరి. అప్పుడు వారు అజామీళుడు చేసిన పాపములన్నిటినీ విష్ణు దూతలకు నివేదిన్చిరి. 

భవంతు పాపాని కథం తు నిష్కృతే కృతేఽపి భో దండనమస్తి పండితాః |
న నిష్కృతిః కిం విదితా భవాదృశామితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౬

ప్రభూ! అప్పుడు నీ భటులు ఆ యమదూతలతో యిట్లనిరి. 'దండనీతి పండితులారా! యితడు చాలా పాపములు చేసే ఉండవచ్చు. కానీ, వాటికి ప్రాయశ్చిత్తము చేసికొన్న పిదప దండనము విధించవలసిన అవసరము ఎట్లుండును? మీ వంటి వారికి ఈ ప్రాయశ్చిత్తము గురించి తెలియదా ఏమి?"

శ్రుతిస్మృతిభ్యాం విహితా వ్రతాదయః పునంతి పాపం న లునంతి వాసనామ్ |
అనంతసేవా తు నికృంతతి ద్వయీమితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౭

"యమభటులారా! వేదాలు, ధర్మ శాస్త్రాలలో చెప్పబడిన వ్రతములు మొదలైనవి పాపములను రూపుమాపును కానీ పాపముల వాసనలను మాత్రము తొలగించ జాలవు. అయితే శ్రీమన్నారాయణుని సేవ పాపములను, వాటి వాసనలు కూడా అంతరిమపజేయును " అని నీ భటులు వారితో పలికిరి.   

అనేన భో జన్మసహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతిః కృతా |
తదగ్రహీన్నామ భయాకులో హరేరితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౮

 "ఈ అజామీళుడు మృత్యు భయముతో నైనను శ్రీహరి నామమును ఉచ్చరించెను. దాని వలన వేల కోట్ల జన్మములలో చేసిన పాపములకన్నిటికీ ప్రాయశ్చిత్తము చేసికోన్నట్లు అయినది. " అని విష్ణు భటులు యమదూతలతో పలికిరి.

నృణామబుద్ధ్యాపి ముకుందకీర్తనం దహత్యఘౌఘాన్మహిమాస్య తాదృశః |
యథాగ్నిరేధాంసి యథౌషధం గదానితి ప్రభో త్వత్పురుషా బభాషిరే || ౨౨-౯

"మానవులు బుద్ధి పూర్వకముగా కాకున్నను హరియొక్క నామ కీర్తన చేసినచో అగ్ని కట్టెలను దహించినట్లు, ఔషధము  రోగములను రూపుమాపినట్లు, అది వారి పాపములను నాశనము చేయును. శ్రీ హరి నామ కీర్తన మహిమ అంత గొప్పది" అని విష్ణు భటులు యమదూతలతో పలికిరి.

ఇతీరితైర్యామ్యభటైరపాసృతే భవద్భటానాం చ గణే తిరోహితే |
భవత్స్మృతిం కంచన కాలమాచరన్భవత్పదం ప్రాపి భవద్భటైరసౌ || ౨౨-౧౦


ఈ విధముగా విష్ణు భటులు పలికినందు వలన యమభటులు అజామీళుని వదలి పెట్టి వెళ్లి పోయిరి. అప్పుడు విష్ణు భటులు కూడా తమ లోకమునకు వెళ్ళిపోయిరి. అందువలన అజామీళుడు కొంత కాలము శ్రీహరిని ధ్యానించుచు కాలము గడపి, చివరకు నీ భటులు వెంటరాగా నీలోకమైన వైకుంఠము చేరుకునెను.

స్వకింగరావేదనశంకితో యమస్త్వదంఘ్రిభక్తేషు న గమ్యతామితి |
స్వకీయభృత్యానశిశిక్షదుచ్చకైః స దేవ వాతాలయ పాహి మామ్ || ౨౨-౧౧

తన కింకరులు ఈ వృత్తాంతము అంతా యమధర్మ రాజుకు తెలియపరచిరి. అందువలన యమధర్మ రాజు భయపడి విష్ణుభక్తుల దగ్గరకు పోరాదని తన భటులను హెచ్చరించెను. అట్టి మహిమ గల గురువాయురప్పా! నన్ను నీవు రక్షింపుము.

ఇరువదిమూడవ స్కంధము - చిత్రకేతూపాఖ్యానం
ప్రాచేతస్తు భగవన్నపరోఽపి దక్షః
త్వత్సేవనం వ్యధిత సర్గవివృద్ధికామః |
ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహుః
తస్మై వరం దదిథ తాం చ వధూమసిక్నీమ్ || ౨౩-౧||


ఓ నారాయణా! ప్రాచేతసులకు దక్షుడను పుత్రుడు ఉండెను. యితడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుడు కాదు. అతడు సంతానాభివ్రుద్ధికై నిన్ను సేవించెను. అప్పుడు నీవు ఎనిమిది చేతులతో ప్రత్యక్షమై ఆ దక్షునకు అసిక్ని అను భార్యను, అతడు కోరిన వరమును కూడా ఇచ్చితివి.

తస్యాత్మజాస్త్వయుతమీశ పునః సహస్రం
శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః |
నైకత్రవాసమృషయే స ముమోచ శాపం
భక్తోత్తమస్త్వృషిరనుగ్నహమేవ మేనే || ౨౩-౨||


దక్షునకు అసిక్ని యందు పదకొండు వేలమంది పుత్రులు కలిగిరి. వారిని దక్షుడు ప్రజావృద్ది చేయుమని కోరగా వారు సత్సంతానము కొరకు తపస్సు చేయ సాగిరి. అప్పుడు నారదుడు వచ్చి ఉపదేశము చేసినందు వలన వారందరూ నిన్ను ధ్యానించుచు తత్త్వమార్గమున ఉండిరి. ఈ విధముగా తన పుత్రులు సంతానాభివ్రుద్ద్ది చేయుటకు విముఖులైనందు వలన దక్షుడు కోపముతో నారదుని ఒకచోట ఉండవద్దని శపించెను. నారదుడు దానిని తనకు వరముగా భావించెను.

షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్
దౌహిత్రసూనురథ తస్య స విశ్వరూపః |
త్వత్స్తోత్రవర్మితమజాపయదింద్రమాజౌ
దేవ త్వదీయమహిమా ఖలు సర్వజైత్రః || ౨౩-౩||

అనంతరము దక్షుని కుమార్తెలైన అదితి మొదలగు అరువది మంది ద్వారా చరాచర సృష్టి జరిగెను. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్యయైన రచన యందు విశ్వరూపుడు జన్మించెను. అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రునకు ఉపదేశించెను. దాని ప్రభావమున దేవాసుర యుద్ధములో ఇంద్రునకు విజయము కలిగెను. ప్రభూ! నీ అనుగ్రహము ఉన్నచో అందరికి జయము కలుగును కదా!

ప్రాక్శూరసేనవిషయే కిల చిత్రకేతుః
పుత్రాగ్రహీ నృపతిరంగిరసః ప్రభావాత్ |
లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ-
సంఘైరముహ్యదవశస్తవ మాయయాసౌ || ౨౩-౪||



పూర్వ కాలమున శూరసేన రాజ్యమునకు చిత్రకేతుడను రాజు పరిపాలించు చుండెను. అతనికి చాలా కాలము సంతానము కలుగలేదు. అంగీరసుడను ముని అనుగ్రహము వలన అతనికి ఒక పుత్రుడు కలిగెను. కాని అసూయ కలిగిన అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేసిరి. అందువలన చిత్రకేతు మనోనిగ్రహము లేక నీ మాయ వలన బాధ పడుచుండెను.

తం నారదస్తు సమమంగిరసా దయాళుః
సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవమ్ |
కస్యాస్మి పుత్ర ఇతి తస్య గిరా విమోహం
త్యక్త్వా త్వదర్చనవిధౌ నృపతిం న్యయుంక్త || ౨౩-౫||

ఆ సమయంలో నారద మహర్షి అంగీరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు వద్దకు వచ్చెను. రాజు దుస్థితి చూసి చనిపోయిన పుత్రుని యొక్క ఆత్మను అక్కడకు రాప్పించెను. ఆ ఆత్మ 'నేనెవ్వరి పుత్రుడను' అని ఎదురు ప్రశ్న వేయుటచే చిత్రకేతువు మోహమును వదులుకొని పర్మాత్మవాగు నిన్నే ఆరాధించ సాగెను. ఇది అంతయు నీ భక్తుడైన నారదమహర్షి అనుగ్రహము వలన జరిగినది. 

స్తోత్రం చ మంత్రమపి నారదతోఽథ లబ్ధ్వా
తోషాయ శేషవపుషో నను తే తపస్యన్ |
విద్యాధరాధిపతితాం స హి సప్తరాత్రే
లబ్ధ్వాప్యకుంఠమతిరన్వభజద్భవంతమ్ || ౨౩-౬||

నారదమహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును, మంత్రమును ఉపదేశించెను. వాటిచేత ఆ మహారాజు ఆదిశేషుని రూపమున నున్న నిన్ను ఆరాధిస్తూ ఏడు రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యెను. తరువాత కూడా ఆ చిత్రకేతువు ఏకాగ్ర చిత్తముతో నిన్నే సేవించుచుండెను.

తస్మై మృణాళధవళేన సహస్రశీర్ష్ణా
రూపేణ బద్ధనుతిసిద్ధగణావృతేన |
ప్రాదుర్భవన్నచిరతో నుతిభిః ప్రసన్నో
దత్త్వాత్మతత్వమనుగృహ్య తిరోదధాథ || ౨౩-౭||

స్వామీ! అంతంత నీవు వేయి పడగలు గల ఆదిశేషుని రూపముతో ఆ మహారాజునకు ప్రత్యక్షమైతివి. అప్పుడు తెల్లని పద్మనాలము వలె శోభిల్లుచుండివి. సిద్ధులు, మునులు మొదలగు వారు నీ చుట్టును చేరి అంజలి ఘటించి, నిన్ను నుతించు చుండిరి. అంతట నీవు చిత్రకేతువు యొక్క స్తుతులకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మ తత్త్వమును ప్రసాదించి అంతర్ధానమైతివి. 

త్వద్భక్తమౌలిరథ సోఽపి చ లక్షలక్షం
వర్షాణి హర్షులమనా భువనేషు కామమ్ |
సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః
సంగాతిరేకరహితో లలితం చచార || ౨౩-౮||


ప్రభూ! నా భక్తశిఖామణియైన చిత్రకేతువు మిక్కిలి ఆనందముతో నీ దివ్య గుణగణములను, గాథలను కీర్తించుచు గాంధర్వ స్త్రీలతో కలిసియున్నప్పటికి సంగరహితుడై అనేక లక్షకోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించెను.

అత్యంతసంగవిలయాయ భవత్ప్రణున్నో
నూనం స రూప్యగిరిమాప్య మహత్సమాజే |
నిశ్శంకమంకకృతవల్లభమంగజారిమ్
తం శంకరం పరిహసన్నుమయాభిశేపే || ౨౩-౯||

చిత్రకేతువు సర్వసంగ పరిత్యాగి కాదలచి నీ ప్రేరణచే కైలాసగిరికి పోయెను. అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారు ఎందరో సేవించు చుండగా పార్వతీదేవి ఒడిలోనున్న శంకరుని చూచి చిత్రకేతువు పరిహసింపగా అందుకు పార్వతీదేవి కోపించి అతనిని శపించినది. 
 
నిస్సంభ్రమస్త్వయమయాచితశాపమోక్షో
వృత్రాసురత్వముపగమ్య సురేంద్రయోధీ |
భక్త్యాత్మతత్త్వకథనైస్సమరే విచిత్రం
శత్రోరపి భ్రమమపాస్య గతః పదం తే || ౨౩-౧౦||


నీపై పరిపూర్ణ భక్తి గల చిత్రకేతువు పార్వతీదేవి శాపమునకు భయపడలేదు, శాపవిమోచనము చేయుమని ప్రార్థించలేదు. అందువలన అతడు వ్రుత్రాసునిగా జన్మించి ఇంద్రునితో యుద్ధము చేయుచు అతనికి ఆత్మ తత్త్వమును తెలిపెను. ఈ విధముగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు వైకుంఠము చేరుకోనేను. ఇది ఎంత విచిత్రము!

త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాఽపి
తాన్ప్రత్యుతేంద్రసుహృదో మరుతోఽభిలేభే |
దుష్టాశయేఽపి శుభదైవ భవన్నిషేవా
తత్తాదృశస్త్వమవ మాం పవనాలయేశ || ౨౩-౧౧||

పరమాత్మా! గురువాయురప్పా! ఇంద్రుని చంపవలెనను కోరికతో దితి నిన్ను ఆరాధించెను. ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైరి. చెడు భావనతో నైనా నిన్ను సేవించినను శుభములే కలుగును కదా! ఈ విధముగా శుభములను కలిగించు స్వామీ! నన్ను రక్షింపుము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి