14, డిసెంబర్ 2010, మంగళవారం

క్షీరసాగర శయన - దేవగాంధారిలో త్యాగరాజు వారి విన్నపము

రామ భక్తి సామ్రాజ్యములో ఓలలాడి మనకు విలువ కట్టలేని ఆధ్యాత్మిక సంపదను సంగీత సాహిత్యము ద్వారా ఇచ్చిన మహానుభావులలో అగ్రగణ్యుడు త్యాగయ్య. తన కృతులు కేవలము రామునివే అని మహారాజు ఇవ్వదలచిన సంపదలను తృణప్రాయముగా తిరస్కరించి ఆ సీతా రాముల సేవలో భౌతికంగా పేదవానిగా బ్రతికి,  ఆధ్యాత్మికంగా మహోన్నతమైన ఎత్తుకు ఎదిగి ఆ రామునిలో ఐక్యమైన త్యాగబ్రహ్మం ఈ భారత దేశానికి చేసిన సేవ ఎనలేనిది. తెలుగు భాష ఇంకా దక్షిణాది సంగీతములో ఇంక బ్రతికి ఉండి అంటే అది వీరి చలవే.

గజేంద్ర మోక్షము

విన్నపానికి దేవగాంధారి అద్భుతమైన రాగం. అందులో ఆవేదన, నివేదన, భక్తి, తాదాత్మ్యత ఇట్టే కనిపిస్తాయి. మరి అటువంటి రాగానికి త్యాగయ్య ఒక ఆర్తితో రాసిన కృతి కూడితే?. దానికి ఏసుదాస్ గారి గళము కలిస్తే? అది ఒక విన్నప రాజము అవుతుంది. అద్భుతంగా ఆలపించారు ఏసుదాసు గారు. ఆర్తి ఆయన గొంతులో తోనికిస లాడి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది.

ఈ కీర్తనలో త్యాగరాజు రాముని - రామా! నీ కీర్తి, దయ, కరుణ అన్ని తెలిసినవే. నన్ను త్వరగా బ్రోవుము - అని వేడుకుంటాడు. దీనికి ఉదాహరణలుగా గజేంద్ర మోక్షము, ద్రౌపదీ మాన రక్షణ (సభలో చీరలు ఇచ్చి), కారాగారములో బందీ అయిన రామదాసుని బ్రోవటానికి తానీష ప్రభువుకు మారువేషంలో వచ్చి కప్పం చెల్లించటం, సీతా దేవి కోసం వారధిని దాటి లంకకు వెళ్లి రావణుని సంహరించటం - ఉపయోగించారు. వారందరినీ బ్రోచినట్టే, నన్ను కూడా బ్రోవుము అని ఆయన ఎంతో భక్తి, కరుణ రసాలతో రాముని వేడుకొంటారు. సాహిత్యం, శ్రవణం (ఏసుదాసు గారి గళంలో)

మాన సంరక్షణ

క్షీరసాగర శయన నన్ను చింతల బెట్ట వలెనా రామ (క్షీర)

వారణ రాజును బ్రోవను వేగమే వచ్చినది విన్నానురా రామ (క్షీర)

నారీమణికి జీర లిచ్చినది నాడే నే విన్నానురా
ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా
నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా
తారకనామ త్యాగరాజనుత దయతో నేలుకోర రామ (క్షీర)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి