7, సెప్టెంబర్ 2010, మంగళవారం

శ్రీరామ జననం - ప్రయాగ రంగదాసు గారి రచన

ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముని జననం గురించి ఈ క్రిందది . రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. కోనసీమలోని గుడిమెళ్లంకపురం వీరి స్వగ్రామం.

దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి,  చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  

రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రవణం.

కళ్యాణ రామునికి కౌసల్య లాలి

 రాముడుద్భవించినాడు రఘుకులంబున
తామసులను దునిమి దివిజ
సోమంబుల క్షేమముకై
కోమలి కౌసల్యకు |శ్రీ రాముడు|


పలువరుస ఆణిముత్యపు
సిరులోయన కిలకిలమని నవ్వుచు


దశరథుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయమారుతములు
దిశలెల్లను విశదములై
వసుమతి దుర్భరము బాప |రాముడు|


తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున
సరస కర్కాటకలగ్న
మరయగ సురవరులెలమిని
కురిపించిరి విరుల వాన |రాముడు|


ధరను గుడిమెళ్లంకపురము
నరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు
మొరలిడగను కరుణించియు వరమీయగ హరియై |రాముడు|

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి