27, జులై 2010, మంగళవారం

శిథిలావస్థలో భారతీయ జనతా పార్టీ

Kamalam
Hastam




కమలం వికసించింది - ఈ నానుడి చాలా ఏళ్ళు సాగినట్టే. 1984 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధి హత్య సానుభూతి పవనాలు కాంగ్రెస్ ను గెలిపించినప్పుడు  542 లో,  2 సీట్లు మాత్రమే గెలుచుకున్న కమల దళం, తర్వాత రామ మందిర ఉద్యమంతో బాగా లాభ పడి 1989 లో 85, 1991లో 120,  1996 లో 161, 1998 లో  182, 1999లో 182 సీట్లు, 2004 లో 138 సీట్లు గెలుచుకుంది. ఈ దాదాపు దశాబ్దమున్నర కాలము (1989 -2004) భారతీయ జనతా పార్టీకి స్వర్ణ యుగమే.

రాజకీయ అతిరథులు వాజపేయి, అద్వానీల సారథ్యంలో హిందూ, కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో బాగా లబ్ది పొంది, సంస్థాగతంగా బలపడి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీనికి ప్రధాన కారణం అంతకు ముందు ఇందిరా, రాజీవ్ హయాంలో అవినీతి భాగోతాలు, వారి ఏక పక్ష పరిపాలన, ఆర్ధిక మాంద్యము మరియు ఆర్థిక విధానాల వల్ల దేశం సాంఘికంగా, ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నది. ప్రజలు వారి పరిపాలనతో విసిగిపోయారు. ఆ సమయంలో వచ్చిన రామ మందిర నినాదం, వి.ఫై. సింగ్ నేత్రుత్వంలోని అవినీతి, కుంభకోణాలపై పోరాటం ప్రతిపక్షాలను ఏకం చేశాయి. ఇందులో భా.జ.పా చాలా లబ్ది పొందింది. ప్రధాన పతిపక్షంగా ఆ పార్టీ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కాని, సంస్థాగతంగా, నినాదాల పరంగా పార్టీ ఒక కనిష్ఠ స్థాయిలో ఉంది అనిపిస్తోంది. కారణాలు ఎంతో చూద్దాము.
  1. జనాకర్షణ నేతలు లేరు - కురు వృద్ధులైన అద్వానీ, వాజపేయి రాజకీయ సన్యాసం చాలా ప్రణాలికా విహీనంగా సాగింది. ఒక ఉద్యమ స్ఫూర్తితో, నినాదంతో, ప్రభుత్వాన్ని ఎండగట్టి ఎన్నికలను గెలిపించే నాయకులు పార్టీలో లేరు. ఉన్న ఒకే ఒక్కడు నరేంద్ర మోడి కరడు గట్టిన హిందుత్వవాది గా ముద్ర పడి పోయాడు. అందుకని ఆయనను పార్టీలో అందరూ ఆమోదించ లేకపొతున్నారు.  మహారాష్ట్రలో ఒక్క రాజకీయ విజయాన్ని కూడా సాధించని గడ్కరీని తీసుకువచ్చి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేశారు. ఇటీవలి ఆయన వ్యాఖ్యలు, వాటిని వెనక్కి తీసుకోవటం చూస్తుంటే ఆయనకు ఎంత పరిణతి ఉన్నది అనేది అనుమానమే.
  2. పార్టీ అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్ చేసినంత నష్టం ఇంకెవ్వరూ ఆ పార్టీకి కలిగించలేదు. ముందు చూపు లేక, అంతర్గత కుమ్ములాటతో, పాతకాలపు ఆలోచనా పధ్ధతి, విధానాలతో పార్టీని నిర్వీర్యం చేశాడు ఆయన. వయసు మీద పడటంతో చూస్తూ ఊరుకున్నారు వాజపేయి, అద్వానీ. ఈయన గారి పుణ్యమా అని కొందరు పార్టీ వదలాల్సి వచ్చింది. ముఠాలు ఏర్పడి పార్టీ బజారున పడింది.
  3. కులాల, మతాల  మీద వచ్చిన రాజకీయ సమీకరణలు వారికి చాలా చోట్ల కలిసి రాలేదు. లోక్సభలో నాలుగోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పూర్తిగా అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా వచ్చిన సునామీలో వారు, కాంగ్రెస్ కొట్టుకు పొయ్యారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అగ్ర వర్ణాల వారికి ఎదురు తిరిగి తమకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చే ఎస్పీ, బీ.ఎస్.పీ, ఆర్.జే.డీ లాంటి పార్టీలకు పట్టం కట్టారు. 
  4. కర్నాటక మినహా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో, దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ధాటికి తట్టుకోలేకపోయారు. వారి స్వార్థ పూరిత, అవకాశవాద రాజకీయాలకు నిలవలేకపోయారు - తృణమూల్, టీ.డీ.పీ, ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే లాంటి పార్టీలు బీ.జే.పీ తో ఫుట్బాల్ ఆడుకున్నాయి.  పూర్తిగా హిందుత్వం వైపు కాకుండా, పూర్తిగా మతాతీత రాజకీయానికి దూరం కాలేక, చిన్న చిన్న పార్టీల మధ్య నలిగి పోయి తమల్ని తాము దెబ్బ తీసుకున్నారు భా.జ.పా నాయకులు. మేదావులైన నవీన్ పట్నాయక్, చంద్ర బాబు నాయుడు, మమత బెనర్జీ, జయలలితల రాజకీయ పిల్లిగంతులకు, చతురతకు భా.జ.పా తట్టుకోలేకపోయింది. అలాగే, హిందుత్వ నినాదం గట్టిగా ఉన్న మహారాష్ట్రలో శివసేనకు కట్టు బడి, స్థానిక నాయకత్వం లేక వెనకబడి పోయింది.
  5. రాజీవ్ మరణం తర్వాత సంస్థాగతంగా దెబ్బతిన్న కాంగ్రెస్ మళ్లీ  పీ.వీ. నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల ఆర్ధిక విధానాల ఫలాలతో, సోనియా, రాహుల్ రాజకీయ పాఠాలు నేర్చుకుని పరిపక్వత చెంది పార్టీ పుంజుకోవటానికి దోహదం చేశారు. ఒంటెద్దు పోకడల రోజుకోసారి ముఖ్యమంత్రులను మార్చే విధానాలకు దూరంగా, కొంత అధికారానికి దూరంగా ఉంటూ వీరిద్దరూ పార్టీని, తమ స్థానాలను పూర్తిగా బలోపేతం చేశారు. రైతులకు వ్యతిరేకి అని టీ.డీ.పీ ని ఓడించిన వై.ఎస్.ఆర్ అండతో ఆంధ్రలో గెలిచి, రాజకీయ చాణక్యుడైన శరద్ పవార్ తో జత కట్టి మహారాష్ట్రలో, మహా కుల, మత ఓట్ల మేధావి అయిన కరుణానిధితో జత కట్టి తమిళనాట మంచి విజయాలు సాధించారు సోనియా, రాహుల్ గారు.ఈ ఇద్దరికీ సాటిగా, దీటుగా ప్రతిపక్షంలో ఎవ్వరు లేరు.
ఇలా, రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అర్థ, అంగ, ఆలోచనా బలాల ధాటికి తట్టుకోలేక, తమ అంతర్గత లోపాలను దిద్దుకోలేక, సతమతమవుతున్న పార్టీ బీ.జే.పీ. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పరిస్థితి చూస్తే అక్కడ వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ గెలవటం గగనమే. యూపిలో నాలుగో స్థానానికి దిగారు. బీహార్లో నితీష్ దయ మీద బతుకుతున్నారు. తమిళనాడు, ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ లో ప్రభావం నామమాత్రమే. ఇప్పటికే పదేళ్ళు పాలించిన మధ్య ప్రదేశ్ లో మళ్లీ గెలవటం తేలిక కాదు. ఒక్క గుజరాత్లోనే వారి పట్టు ఇంకా ఉంది.  అది ఎన్నాళ్ళో మరి. మిగిలిన అన్ని చోట్ల సడలుతోంది/సడలిపోయింది.  మొత్తానికి, సంస్థాగతంగా అద్భుతాలు జరిగితే తప్ప ఒక దశాబ్దం పాటు భా.జ.పాకు చాలా గడ్డు కాలమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి