15, జులై 2010, గురువారం

నెంబర్ ౨ సైనా నెహ్వాల్

రాజీవ్ ఖేల్ రత్న, ద్రోణాచార్య, పద్మశ్రీ - మూడు అవార్డులనూ పొందిన ఏకైక భారతీయ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్.  ఈ మూడు భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాకరమైన పురస్కారాలు.  2001 లో అల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్షిప్ గెలుచుకున్న గోపీచంద్ తర్వాత హైదరాబాద్లో గోపీచంద్ అకాడెమీని స్థాపించి అంతర్జాతీయ టోర్నీలలో పోటి చేసి గెలవగల సత్తా ఉన్న క్రీడాకారుల్ని అందజేస్తున్నాడు ఈ దేశానికి. ఆ యువ ద్రోణాచార్యుడి చేతిలో తర్ఫీదు పొందిన షటిల్ బాడ్మింటన్ వనితా కిశోరం సైనా నెహ్వాల్.

బాడ్మింటన్లో ఇవ్వాళ్ల ప్రపంచంలో రెండో ర్యాంకు ఈ హైదరాబాది అమ్మాయిది. ఇదేమి సులభం కాదు. గురువు, శిష్యురాలి కఠిన, కఠోర శ్రమ ఫలితం మన సైనా ఈ అగ్ర స్థానంలో ఉండటానికి కారణం. క్రికెట్ తప్ప వేరే ఏ క్రీడను ఆదరించని, అభిమానించని ఈ భారత దేశంలో మనందరికీ గర్వ కారణమైన సైనాకు మంచి భవిష్యత్తు ఉంది. సానియాలా కాకుండా ఈ అమ్మాయి తన ఆట మీద, శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టి, మీడియా దృష్టికి చెదరకుండా ఆటను నిలుపుకొని ముందుకు వెళ్తోంది. గోపీచంద్ గారికి, సైనాకు మా శుభాకాంక్షలు. ఆట బాగుంటే నెంబర్ 1 చేరుకోవటం కష్టమేమి కాదు. కానీ చేరిన స్థానాన్ని నిలుపుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని సుదీర్ఘమైన కెరీర్ నిర్మించటం అతి కష్టమైనది. సైనా ఈ దిశలో ఆలోచించి ముందడుగు  వేయాలని ఆశిస్తూ, ఒక్క సచిన్ టెండూల్కర్ కే కాదు సైనా లాంటి మంచి ఆటగాళ్లకు కూడా సరైన గుర్తింపు, గౌరవము, ప్రతిఫలము ప్రభుత్వం ఇవ్వాలని నా విన్నపం.

సైనా కెరీర్లో కొన్ని మైలు రాళ్ళు:
  1. ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2008)
  2. ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ టైటిల్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి.  (2008)
  3. మూడు వరుస సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి.  (2009 -2010 )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి