30, జులై 2010, శుక్రవారం

అత్యాశ, అవకాశవాదం

2009 శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయినా పీ.సి.సి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గారు తన గుణపాఠం నేర్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనవంతు తను తెలంగాణా ఏర్పాటుకు ఇసుమంత కృషి కూడా చెయ్యలేదు. ఏడాది నుంచి ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఆయన తన పదవిని, ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణపై స్పష్టతకు ఏమీ చెయ్యలేదు. కానీ, ఎప్పుడైతే చిదంబరంగారు రాత్రికి రాత్రి ప్రకటన చేశారో, అప్పటినుంచి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని గ్రహించి, దానికి అధిష్ఠానం ఆశీర్వాదం ఉందని తెలిసి, తన పావులు తను కదిల్పారు. అంటే?. తనకు తన నియోజకవర్గంలోనే గతి లేదు కాని రాష్ట్రాన్ని పాలించాలన్న అత్యాశా?. ఎంత అన్యాయమండీ శ్రీనివాస్ గారు?. పోయిన సారి మీరు మైనార్టీల మీద చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఓడిస్తే, ఈ 2010 ఉపఎన్నికల్లో పచ్చి తెలంగాణా వాదం మిమ్మల్ని, మీ ఆశలని ముంచింది. మైనార్టీ వోటర్లు చాలా మంది ఉన్న ఆ వోటు బ్యాంకు మిమ్మల్ని గెలిపించ లేకపోయింది.

అయ్యా. ఎప్పుడూ మీ గురించే కాదు. కొంచెం ప్రజల గురించి, వాళ్లు ఏమి అనుకుంటున్నారో తెలుసుకోండి. ఢిల్లీ చుట్టూ తిరిగి, అమ్మగారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటే చాలదు. కాస్త ప్రజల నాడి కూడా గమనించండి. మీరు తెలంగాణలో మంచి ధనికమైన జిల్లాలో ఉన్నారు. దాన్ని మీ ప్రాంతపు ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, మేడం తెలంగాణాకు ఒకే చెప్పారు అని ప్రచారంలో మాట్లాడారు కదా మరి దాన్ని కార్యరూపంలో చూపించండి. ఇప్పటినుంచి ఒక సంవత్సరంలోపు తెలంగాణా రాష్ట్రాన్ని తేవటానికి ముఖ్యమంత్రి, శాసనసభ్యుల ద్వారా చెయ్యాల్సిన పని చేయించి, అలాగే పీ.సి.సి. అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెట్టి, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టించండి. ఇంక చాలు మన నాటకాలు, దోబూచులాటలు, కాలాయాపానలు.

ప్రజలు మూడు సార్ల నుంచి, ముప్ఫై ఏళ్ళ నుంచి తెలంగాణా విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వాటిని గౌరవించి, ఢిల్లీకి, వ్యాపారులకు అమ్ముడుపోకుండా తెలంగాణా ఏర్పాటుకు సహకరించండి. ప్రజలు మంచి ఉద్దేశాలను, పనులను ఎప్పటికైనా గౌరవిస్తారు. అలా చేస్తే, మిమ్మలిని, మీ పార్టీని ఆదరిస్తారు కూడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి