29, జూన్ 2010, మంగళవారం

అన్నమయ్య దశావతార వర్ణన

అన్నమయ్య దశావతారాల్ని వర్ణిస్తూ రాసిన ఒక కీర్తన:

ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి॥౨

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాది చేయి
తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

సారాంశం:
 వేదాలను కాపాడటానికి మత్స్యావతారం, అమృత మథనంలో మందరపర్వతాన్ని వాసుకి చిలుకుతుండగా ఆ బరువుని మోసిన కూర్మావతారం, భూదేవి ప్రార్థన విని వరాహావతారంలో భూమిని ఎత్తి, వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని చంపిన నరసింహావతారం,  బలిచక్రవర్తిని మూడు అడుగులు దానమడిగి విశ్వవ్యాప్తమై అతన్ని పాతాళానికి పంపించిన వామనావతారం,  క్షత్రియ నాశనం చేసి భూమిని బ్రాహ్మణులకు దానం చేసిన పరశురామావతారం,  తన బాణంతో సముద్రుడిని గడగడలాడించి వానరసేనకు లంకదారి చూపిన రామావతారం, 
 నాగలి ధరించి శత్రునాశనం చేసిన బలరామావతారం, గోపికల చీరలు దోచి వారి అహంకారాన్ని అణచిన కృష్ణావతారం,  అశ్వం ఎక్కి దుష్టసంహారం చేసే కల్కి అవతారం - ఏ అవతారమైనా భక్తులకు మోక్షమిచ్చే ఆ పరమాత్మ మన తిరుమలకొండలపై వెలసిఉన్న ఆ శ్రీవేంకటపతి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి